విషజ్వరాలు

విషజ్వరాలు 


విషజ్వరాలంటే ?
తక్కువ కాలంలోనే ప్రాణానికి ప్రమాదం కలిగించే జ్వరాలను విషజ్వరాలనొచ్చు.
* ఫాల్సీపారం మలేరియా.
* డెంగ్యూ వంటి వైరస్‌ జ్వరాలు.
* లెప్టోస్పెరోసిస్‌ అనే జబ్బు వల్ల వచ్చే జ్వరాలు.
* మెదడువాపు (ఎన్‌కెఫలైటిస్‌) వంటి మెదడు సంబంధమైన ఇన్‌ఫెక్షన్లు.
* గుండె సంబంధమైన వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు.
ఈ జ్వరాలన్నింటిలోను ప్రాణంపోయే అవకాశాలున్నాయి. ఇవి గత రెండు, మూడేళ్లలో బాగా ఎక్కువైపోయాయి. ఒక రకంగా చూస్తే ఈ విషజ్వరాలు కలవారిలో, లేనివారిలో ‘శోషలిజం’ తీసుకొచ్చాయి.
ఎందుకొస్తాయి?
ఫ్లూ, స్వైన్‌ ఫ్లూ వంటి జబ్బులతో ఉన్న రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలిద్వారా వైరస్‌ మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది. రోగిని కుట్టిన దోమలు మరొక ఆరోగ్యవంతుని కుట్టినప్పుడు డెంగ్యూ, మలేరియా, మెదడువాపు వ్యాధి వంటి జ్వరాలు వ్యాపిస్తున్నాయి.
ప్రమాదం ఎలా జరుగుతుంది?
గాలిద్వారానో, దోమల ద్వారానో శరీరంలో ప్రవేశించిన క్రిమి అతి త్వరగా అక్కడ అభివృద్ధి చెంది, శరీరంలోని ముఖ్య బాగాలైన మెదడు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, మూత్ర పిండాలపైన దుష్ప్రభావం చూపిస్తుంది. ఈలోగా మన దేహం ఆ క్రిమి ప్రమాదకరమైనదని కనిపెట్టి తన రోగనిరోధక శక్తిని ఉపయోగించి, ప్రతిబంధకాల (ఆంటిబాడీస్‌)ను తయారు చేసి, నిర్వీర్యం చేసే పనిలో ఉంటుంది. ఈ ప్రయత్నంలో ఎక్కువసార్లు దేహమే విజేతగా నిలిచి, జ్వరం తగ్గిపోతుంది. కొన్నిసార్లు మాత్రం వివిధ కారణాల వల్ల క్రిమి ఎంతో బలమైనదైతేనో, పిల్లల్లో, వృద్ధుల్లో, గర్భిణులల్లో కొన్ని మందులు వాడేవారిలో రోగినిరోధకశక్తి తక్కువగా ఉంటేనే, క్రిమి గెలుపొంది, శరీరంలోని ప్రధాన భాగాలను దెబ్బతీసి, ప్రాణాపాయం కలుగవచ్చు.
ఎలాంటి వైద్యం చేయాలి ?
పైన పేర్కొన్న జ్వరాలలో మలేరియాకు తప్ప ఇతర జబ్బులకు నిర్దిష్ట వైద్యమేదీ లేదు. డెంగ్యూ, మెదడువాపు, ఫ్లూ వంటివి సహజమైన రోగనిరోధక శక్తితోనే చాలా మందిలో ఇవి తగ్గిపోతాయి. జ్వరం ప్రమాదకరంగా ఉన్నప్పుడు సహాయ నిర్వహణ చేయాల్సి ఉంటుంది. మూత్రపిండాల వైఫల్యం జరిగితే తదనుగుణమైన వైద్యం, కాలేయం దెబ్బతింటుంటే తత్సంబంధ వైద్యం, ఊపిరితిత్తులు పనిచేయనప్పుడు కృత్రిమ శ్వాస అందించడం, రక్తపోటు తగ్గిపోతుంటే పెంచే ప్రక్రియ.. ఇవే సపోర్టివ్‌ మేనేజ్‌మెంట్‌లు. ఐతే ఇవి చేయడం ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ ఉన్న ఆసుపత్రుల్లోనే వీలవుతుంది.
ప్రస్తుతం ఏం జరుగుతుంది?
ప్రతిదీ విషజ్వరమేమో అని రోగి, కుటుంబ సభు ్యలు భయపడుతున్నారు. తమవీధిలోనో, ఊళ్లోనో డెంగ్యూ కేసు వచ్చిందని తెలియగానే భయభ్రాంతులవుతున్నారు. ఆసుపత్రులన్నీ జ్వరాల పీడితులతో కిక్కిరిసి పోతున్నాయి. బస్తీలలోని ఏ ఆసుపత్రుల్లోనూ మంచాలు చాలడం లేదు. ఒక డాక్టర్‌ ఒకేసారి ఎక్కువ మంది సీరియస్‌ రోగులను చూడాల్సి రావడంతో ఒత్తిడికి లోనవుతున్నారు. రోగుల బంధువులకూ అసహనం పెరిగిపోతున్నది. ఐసియు వ్యవస్థ ఉన్న ఆసుపత్రుల్లో ప్రవేశం దొరకడమే దుర్లభంగా ఉంది.
డాక్టర్లేమంటున్నారు?
విషజ్వరాలు ప్రతి సంవత్సరం రుతుక్రమంలో వస్తునే ఉంటాయి. కానీ, జబ్బుల స్వభావం మారుతున్నది. 10 నుంచి 15 ఏళ్ల కిందట ఫాల్సీఫారం మలేరియాను స్వయంగా చూసిన వైద్యులు చాలా తక్కువ. ఇప్పుడా జబ్బును ప్రతి వైద్యుడూ చూస్తున్నాడు. మెదడు వాపు జబ్బు మాత్రం ఇంతకు ముందుకన్నా తగ్గింది. డెంగ్యూ కేసులు ఎప్పుడూ చూడని డాక్టర్లు ఈ సంవత్సరం ప్రతినిత్యం చూస్తున్నారు. ఐతే ఆసుపత్రుల్లో చేరిన కేసుల్లో ఒక్కశాతం కన్నా తక్కువ మరణాలే నమోదవుతున్నాయి. మందులు, అత్యాధునిక పరికరాలు, వైద్యుల శక్తియుక్తుల, సక్రమవినియోగం- ఇవన్నీ అందుబాటులో ఉన్నా ప్రతి రోగినీ కాపాడలేకపోవచ్చు.
అభివృద్ధి చెందిన దేశాలలో ఏం జరుగుతుంది?
గత ఏడాది అమెరికా, యూరప్‌లలో ఒకానొక ప్రత్యేకమైన వైరస్‌ మనుషుల్లో ప్రవేశించి, ఊపిరిత్తులను పాడుచేసి, స్వైన్‌ఫ్లూ అనే పేరుతో గణనీయమైన మరణాలకు కారణమయింది. ఆయా ప్రభుత్వాలు అప్పటికప్పుడు పరిశోధనకు దిగి, పందులలో సాధారణంగా ఉండే హెచ్‌1ఎన్‌1 అనే వైరస్‌ రూపాంతరం చెంది, మనిషి శరీరంలో కూడా బతకనేర్చిందని కనిపెట్టాయి. వెంటనే ఆ వైరస్‌ వ్యాప్తి నిరోధానికి మార్గదర్శకాలు రూపొందించి, బహుళ ప్రచారంతో విజయం సాధించాయి. అదే సమయంలో కేవలం 9నెలల కాలంలోనే పరిశోధనలు జరిగి, స్వైన్‌ఫ్లూ వ్యాధికి టీకా (వ్యాక్సిన్‌)ను తయారు చేశాయి. ఏ ప్రభుత్వాలైనా చేయాల్సింది ఇదే కదా!
మనలో ఎవరెవరం చేయాలి ?
* పరిసరాల పరిశుభ్రత మన తొలి ప్రాధాన్యం కావాలి.
* బహిరంగ మురుగుపారుదల స్థానంలో మూసిన పారుదల అత్యవసరంగా ఏర్పడాలి.
* ఐతే ఇందుకోసం వేలకోట్లరూపాయలు ఖర్చుచేయగల స్తోమత మన రాష్ట్రానికి లేందంటారు. కానీ పాలకులకే చిత్తశుద్ధి ఉంటే, ప్రజలు చైతన్యవంతులైతే, లక్షల కోట్ల స్కామ్‌లు ఆపగలిగితే మార్గం దొరకదా?
* కనీసం మురుగుకాల్వల్లో నీరు నిలవకుండా జాగ్రత్తలైనా తీసుకోవాలి.
* దోమలు పుట్టకుండాను, ఉన్నవాటిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలి.
* బహిరంగ మలవిసర్జన జరగకుండా ఉండాలంటే వ్యక్తిగత మరుగుదొడ్లను ప్రోత్సహించే శ్వాశ్వత దీర్ఘకాల ప్రణాళిక కావాలి.
* మన బంధువులకో, సన్నిహితులకో జ్వరం వచ్చినప్పుడు ప్రతి జ్వరం విధిగా ప్రమాదం కాదని గుర్తించి ధైర్యంగా ఉండాలి.
* నూరు డెంగ్యూ కేసుల్లో ఒక్కటే ప్రమాదకరం. ఆ ప్రమాదకరమైంది కూడా ఐసియులో పెట్టి, సహాయ నిర్వహణ వైద్యం చేస్తే నయమయ్యే అవకాశముంది. వైద్య సమయంలో డాక్టర్లపై ఒత్తిడి తీసుకురాకుండా, స్థిమితంగా ఉండాలి. ఇంత మంది రోగులకు వైద్యం చేయడానికి సరిపడా వైద్యలు మనకు లేరు.
* ప్రసార మాధ్యమాలు విషజ్వర మరణాలను ప్రసారం చేయడంతోపాటు ఎన్ని వేల కేసుల్లో ఎన్ని మరణాలు సంభవించాయనే గణాంకాలను కూడా చెప్పాలి. సంచలనాలతో బాటు సంయమనం కూడా అవసరమే. ప్రభుత్వం, అధికార నిపుణుల సహకారంతో సానుకూల దృక్పథంతో మార్గదర్శకాలను రూపొందించాలి. ధైర్యంతో పరిపూర్ణ అవగాహనతో ప్రస్తుత వైద్య అత్యవసర పరిస్థితిని సమిష్టిగా ఎదుర్కొవాలి.
డాక్టర్‌ డి.ఆర్‌.కె. ప్రసాద్‌
రాష్ట్ర హెల్త్‌ సబ్‌కమిటీ సభ్యులు,
జనవిజ్ఞానవేదిక,
పద్మావతి హాస్పిటల్‌,చల్లపల్లి, కృష్ణాజిల్లా.