రెడీ టు ఈట్‌ భుజియా తయారీ పరిశ్రమ



ఇటీవల కాలంలో బాగా పాపులర్‌ అయిన రెడీ టు ఈట్‌ స్నాక్స్‌ ఉత్పత్తుల్లో భుజియా ఒకటి సన్నటి 
కారపుపూసలా ఉండి, అన్ని వయస్సుల వారు, అన్ని సమయాల్లో తినడానికి అనువైన పదార్థంగా భుజియా
 గుర్తింపు పొందింది. 

భుజియా తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా జీర్ణశక్తిని పెంచానికి కూడా 
తోడ్పడటం విశేషం. అందువల్ల తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా బాగా ఆదరణ పొందింది.


శనగపిండి, పెసరపిండి, ఉప్పు, కారం, లవంగపొడి, నల్ల మిరియాల పొడి, యాలకుల పొడి, జాజికాయ చూర్ణం,
 దాల్చినచెక్క చూర్ణం, వేరుశనగపిండి, నువ్వులపొడి వంటి వివిధ రకాల పప్పులు, మసాలా ఉత్పత్తులు,
 సుగంధ ద్రవ్యాలను నిర్ణీత నిష్పత్తిలో ఉపయోగించి భుజియా తయారుచేస్తారు. అందువల్లే ఇది రుచికరంగా
 ఉండటమే కాకుండా జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.


ముందుగా పప్పులను పొడిగా చేసి వేర్వేరుగా జల్లించాలి. తరవాత సుగంధ ద్రవ్యాలను కూడా పొడులుగా
 తయారుచేసుకొని జల్లించి సిద్ధంచేసుకోవాలి. తరవాత నిర్ణీత నిష్పత్తిలో వివిధ పప్పుల పొడులను మిశ్రమంగా 
కలపాలి. తరవాత నిర్ణీత నిష్పత్తిలో సుగంధ ద్రవ్యాల పొడులను పప్పుల మిశ్రమంలో వేసి బాగా కలపాలి. కొంత 
నూనె, నీరు కూడా చేర్చి ముద్దగా బాగా కలపాలి.

 తరవాత ఈ పిండి ముద్దను భుజియా యంత్రంలో మధ్యస్థంగా కాగిన నూనెలో నేరుగా సన్నటిపూసను 
చుట్టలుగా వేస్తారు. ఈ చుట్టలు బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి, వెంటనే నూనె తొలగించే
 పళ్లెంలో వేయాలి. చల్లారిన తరవాత చిన్న చిన్న ముక్కలుగా చిదిమి, తరవాత సుగంధ
 ద్రవ్యాలు కలిపి, వివిధ సైజుల ప్లాస్టిక్‌ పౌచ్‌లలో, కార్టూన్‌ బాక్సుల్లో ప్యాకింగ్‌ చేసి మార్కెట్‌కు
 పంపుకోవాల్సి ఉంటుంది.


మార్కెటింగ్‌ విధానం


గ్రామాలు, పట్టణలు అన్న భేదం లేకుండా అన్ని కిరాణా దుకాణాలు, చిన్న బంకుల్లో, సూపర్‌మార్కెట్లు, మార్కెట్లు, క్యాంటీన్లు, బస్‌స్టాండ్‌లు, రైల్వేస్టేషన్లలోని స్టాల్స్‌లో భుజియా పౌచ్‌లను అందుబాటులో ఉంచడం ద్వారా వినియోగదారులకు అమ్మకాలు చేయాల్సి ఉంటుంది.

 మండలాల వారీగా, పట్టణాలవారీగా డిస్ర్టిబ్యూటర్లను ఏర్పాటుచేసి ఉత్పత్తులను పంపిణీ చేయాల్సి ఉంటుంది.

పరిశ్రమ వ్యయం
ఉత్పత్తి సామర్థ్యం: రోజుకు 250 కేజీలు / సంవత్సరానికి 75 టన్నులు
పరిశ్రమ వ్యయం: 25.00 లక్షలు