అమ్మాయిలకు రాత్రుల్లో రోడ్లపై పనేంటి : కేంద్రమంత్రి

కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖామంత్రి మహేష్ శర్మ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాంపై వ్యాఖ్యలు చేసి విమర్శలు పాలైనప్పటికీ.. ఈయనకు జ్ఞానోదయం కలగలేదు. ఫలితంగా ఇపుడు అమ్మాయిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

mahesh sharma

భారత్‌లో అమ్మాయిలు రాత్రి పూట తిరగడం మన సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. 'అమ్మాయిలు రాత్రిపూట తిరగడం మరో ప్రాంతం లేదా దేశంలో సరైనదే కావచ్చు. కానీ, భారత సంస్కృతిలో మాత్రం అది భాగం కాదు' అని ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. అసలు రాత్రుళ్లు యువతులు ఎందుకు రోడ్లపై తిరగాలని ఆయన ప్రశ్నించారు. 

జైనుల పండగ సందర్భంగా, వారిని గౌరవించేలా కొద్ది రోజులు మాంసానికి దూరమైతే తప్పేంటని కూడా ఆయన ప్రశ్నించారు. రెండు రోజుల పాటు త్యాగం చేయలేరా? అని అడిగారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో సుదీర్ఘ అనుబంధమున్న మనీష్ శర్మ తాజా వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.